ముదిగొండ మండలం, జూన్ (TV6 24/7 NEWS). ఖమ్మం జిల్లా ముదిగొండలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 25వ మహాసభ సందర్భంగా వేలాది మంది వ్యవసాయ కార్మికులు, శ్రామిక జనాలు ఎర్రజెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. భూపోరాట అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి ప్రారంభమైన ఈ ర్యాలీ ముదిగొండ నుంచి వెంకటాపురంలోని సభా ప్రాంగణం వరకు కొనసాగింది. ఎర్రజెండాలు, ఎర్ర చొక్కాలు, టీషర్టులు, మహిళల ఎర్ర చీరలతో ముదిగొండ, వెంకటాపురం ప్రాంతాలు ఎరుపుమయంగా మారాయి. డప్పు వాయిద్యాలు, కోలాట బృందాల సాంస్కృతిక ప్రదర్శనలు ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ర్యాలీ అగ్రభాగాన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి.వెంకట్, రాష్ట్ర కార్యదర్శి ఆర్.వెంకటరాములు, ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మెరుగు సత్యనారాయణ, పొన్నం వెంకటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు నున్నా నాగేశ్వరరావు, బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ నాయకులకు ఘన స్వాగతం పలికిన శ్రేణులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ఐద్వా, సీఐటీయూ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.