కూసుమంచి మండలం, జూన్ 10 (TV6 24/7 NEWS): ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడే అత్యవసర అంశమని అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కూసుమంచి మండలం నాయకులగూడెం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, ఐఎస్ఐ ప్రమాణాల హెల్మెట్ ధరించడం, సీట్బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవడం, పరిమిత వేగంతో వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. మద్యం సేవించి లేదా మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు.
రోడ్డు సంకేతాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ను తప్పనిసరిగా పాటించాలని, జీబ్రా క్రాసింగ్ ద్వారానే రోడ్డు దాటాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పీయూసీ పత్రాలను వెంట ఉంచుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా ఇటీవల కూసుమంచి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదాల బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సూచనలను ప్రజలకు తెలియజేశారు. అలాగే ధర్మ తండాకు చెందిన ప్రమాద మృతుడు సందీప్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.