చిత్తూరు జిల్లా, జూన్ 6 (TV6 24/7 NEWS): చిత్తూరు జిల్లాలో ఓ మద్యం వ్యాన్ ప్రమాదానికి గురైంది. ఎస్.ఆర్. పురం మండలం బసిరెడ్డిపల్లి సమీపంలో మద్యం లోడుతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్లోని మద్యం బాటిళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో సుమారు రూ.10 లక్షల విలువైన మద్యం బాటిళ్లను స్థానికులు తీసుకెళ్లినట్లు సమాచారం.
చిత్తూరు జిల్లా ఎస్.ఆర్. పురం మండలం బసిరెడ్డిపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం సరఫరా కోసం వెళ్తున్న వ్యాన్ టైర్ పగిలి అదుపుతప్పి బోల్తా పడినట్లు తెలుస్తోంది. ప్రమాదం కారణంగా వాహనంలో ఉన్న మద్యం బాటిల్తో ఉన్న బాక్సులు రోడ్డుపై చిందరవందరగా పడ్డాయి.
విషయం తెలుసుకున్న స్థానికులు, దారిన వెళ్తున్న వారు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని మద్యం బాటిళ్లను తీసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.