TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, వైరా మండలం, జూన్ 18. రైతుల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ ఎఒ మంజూమ్ ఖాన్, వైరా ఎస్సై రామారావు తెలిపారు.
వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టడానికి వ్యవసాయ, పోలీస్ శాఖలు సంయుక్తంగా గురువారం వైరా లోని తాడిపూడి లో ముమ్మర తనిఖీలు చెప్పట్టారు. విత్తన దుకాణాలు, గోదాములు, రవాణా కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఫర్టిలైజర్స్ అండ్ సీడ్స్ షాపులను సందర్శించి, విక్రయాల రికార్డులు, స్టాక్ వివరాలు, లైసెన్సులు, బిల్లుల నిర్వహణ, నిల్వల పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు.
రైతులకు విక్రయిస్తున్న విత్తనాలు, ఎరువులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఆరా తీశారు. అలాగే ప్యాకెట్లపై ఉన్న వివరాలు, తయారీ తేదీలు, గడువు తేదీలు, కంపెనీ గుర్తింపు తదితర అంశాలను పరిశీలించారు.
ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ…రైతుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిదని, రైతుల కష్టార్జిత సంపాదనను దోచుకునే నకిలీ వ్యాపారులపై పోలీస్, వ్యవసాయ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.
వైరా పరిసర ప్రాంతాల రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని అధికారులు ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు.