TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్. ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని గ్రీన్ఫీల్డ్ హైవేపై శనివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తల్లాడ మండలం రామానుజవరం గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి ఎడమవైపు బారికేడును ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది.
అన్నవరం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారు అదుపుతప్పి బారికేడు ఢీకొట్టడంతో కారు పల్టీలు కొట్టి హైవేపై పడిపోయింది. కారును నడుపుతున్న స్వర్ణకంటి జస్వంత్ (36) అలియాస్ అశోక్ , హైదరాబాద్ నివాసి అక్కడికక్కడే మృతి. మృతుడు బొల్లారం పోలీస్ స్టేషన్లో 2021 బ్యాచ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రమాదంలో జస్వంత్ భార్య జ్యోతి కిరణ్ మౌనికకు తీవ్ర గాయాలు కాగా, వారి కుమార్తె మాన్య (6) కాలుకు స్వల్ప గాయాలయ్యాయి. కుమారుడు కళ్యాణ్ రామ్ (4) ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.
జస్వంత్ కుటుంబ సభ్యులతో కలసి అన్నవరం దేవస్థానం దర్శించుకుని హైదరాబాద్కు తిరుగి వెళుతుండగా ప్రమాదం సంభవించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. గాయపడిన భార్య, పిల్లలను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు…